Janapadham_EPaper_TS_13-11-2024
పక్కా ప్లాన్..?!
దాడి వెనక పట్నం
కేటీఆర్ కు ఎప్పటికప్పుడు సమాచారం
వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు
ప్రధాన నిందితుడికి గులాబీ నేతలతో సంబంధాలు
ఘటనకు ముందు నుంచి మాజీ ఎమ్మెల్యేకు 43 సార్లు ఫోన్ కాల్స్
నరేందర్ రెడ్డి నుంచి కేటీఆర్ కు ఫోన్లు..
డేటా వివరాలు సేకరించిన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో రెగ్యులర్ టచ్
జనపదం, బ్యూరో
వికారాబాద్ లో జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడి ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటన వెనుక అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. కలెక్టర్ పై జరిగిన దాడి పూర్తిగా రాజకీయ వ్యూహంతోనే జరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలుతున్నాయి. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో పోలీసుల దర్యాపు సైతం శరవేగంగా జరుగుతోంది. దాడి ఘటనలో పలు షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ప్రధానం కలెక్టర్ పై దాడి జరిగిన ఘటనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అగ్రనేతల కనుసన్నలోనే జరిగినట్లుగా తెలుస్తోంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఈ ఘటనకు అసలు సూత్రధారుడిని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో కలెక్టర్పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం సేకరణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సోమవారం లగచర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. గ్రామస్తుల ముసుగులో బీఆర్ఎస్ కు చెందిన యూత్ వింగ్ నాయకులు ఎంటరై అధికారులపై దాడికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకట్రెడ్డిలపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కలెక్టర్ తప్పించుకోగా, పలువురు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన సురేష్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
42 సార్లు సంభాషించిన సురేష్..
జిల్లా కలెక్టర్తో పాటుగా పలువురు అధికారులను లగిచర్లకు తీసుకువెళ్లడంలో ప్రధానంగా సురేష్ వ్యవహరించినట్లుగా తేలింది. నిందితుడుగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తించారు. దాడికి కొన్నిగంటల ముందు నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడాడు. ఓ వైపు సురేష్తో మాట్లాడుతూ మరోవైపు 6 సార్లు కేటీఆర్తో ఫోన్ లో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు కాల్ డేటా ప్రకారం తేలింది. దీంతో దాడి ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఇక, సురేష్పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులున్నాయి. చెల్లి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు రేప్ కేసు నమోదైంది. ఆయనపై కేసులు తొలగించేలా పట్నం నరేందర్రెడ్డి సహాయం చేసినట్టు తెలుస్తోంది.ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి చేసేలా జనాలను సురేష్ రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
స్వచ్ఛందంగా ఇచ్చారా..?
వికారాబాద్ జిల్లా లగ్గిచర్లలో ఫార్మా విలేజ్పై అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్పై స్థానిక ప్రజలు దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాదు కలెక్టర్, అధికారులకు సంబంధించిన మూడు కార్లను ప్రజలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో గ్రామంలో తీవ్ర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించాగా.. అందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీంతో కలెక్టర్, రెవెన్యూ అధికారులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కీలం కానున్న ఏడీజీ నివేదిక..
దాడి ఘటనలో ఏడీజీ నివేదికే అత్యంత కీలకం కానుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా మంగళవారం ఉదయం హైదరాబాద్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబుతో వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐజీ సమాశమయ్యారు. సోమవారం దాడి ఘటనపై వారి నుంచి మంత్రి శ్రీధర్ బాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు.