Rishabh Pant| క్రికెట్ ప్రేమికులకి రిషబ్ పంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సులు కొల్లగొట్టాడు పంత్. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో డిసెంబర్ 30, 2022లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతను 2023 సంవత్సరం మొత్తం క్రికెట్కి దూరంగా ఉన్నాడు. చావు వరకు వెళ్లి వచ్చిన పంత్ క్రమక్రమంగా కోలుకొని ఐపీఎల్ 2024లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా తిరిగొచ్చాడు. 13 మ్యాచ్ లలో 446 రన్స్ చేసిన పంత్ , మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కారణంగా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జట్టులోకి కూడా సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు.
అయితే పంత్ తాజాగా శిఖర్ ధావన్ హోస్ట్ చేస్తున్న ధవన్ కరేంగే అనే షోలో పాల్గొన్నాడు.ఈ షోలో తనకు ఎదురైన పరిస్థితలు గురించి చెప్పుకొచ్చాడు. రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని ఎంతో మార్చిందని చెప్పిన పంత్.. తనకు తీవ్రమైన గాయాలు కావడంతో తను ప్రాణాలతో ఉంటానో లేదో అని అనిపించింది. అయితే ప్రమాదం వలన తాను ఏడు నెలల పాటు తీవ్రమైన నొప్పిని అనుభవించాడట. తనకు చాలా నరకంగా కూడా ఉందని అన్నాడు .రెండు నెలల పాటు బ్రష్ కూడా చేసుకోలేకపోయానని పంత్ అన్నాడు. వీల్ ఛైర్లో ఉండే వ్యక్తులను చూస్తే తనకు ఇబ్బందిగా అనిపించేందని అందుకనే ఎయిర్పోర్టుకు వెళ్లలేకపోయానని చెప్పాడు. మొత్తానికి దేవుడు తనను రక్షించాడని రిషబ్ తెలిపాడు.
ఇక ఇప్పుడు క్రికెట్ లోకి తిరిగి వస్తున్న వేళ ఒత్తిడి కంటే ఉత్సాహమే తనలో ఎక్కువగా ఉందని పంత్ చెప్పుకొచ్చాడు. తన జీవితంలో తన తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైన ఒక సందర్భాన్ని కూడా రిషబ్ పంత్ పంచుకున్నాడు. తాను ఐదో తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు మా నాన్న నాకు రూ.14 వేల విలువైన బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అది చూసి మా అమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది” అని పంత్ వెల్లడించాడు. పంత్ ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం కఠిన సాధన చేస్తున్నాడు.